భోజనానంతరం చదివే ఉత్తరాపోశన మంత్రానికి (అమృతాపిధానమసి రౌరవే....) అర్థం
భోజనానంతరం చదివే ఉత్తరాపోశన మంత్రానికి (అమృతాపిధానమసి రౌరవే....) అర్థం
జవాబు
పెద్దలద్వారా నేను తెలుసుకొన్న విషయాలను మీకు వివరించటానికి ప్రయత్నిస్తాను. భాషా విషయికంగా ఎక్కడన్నా నేను పొరబడితే పెద్దలు సవరించమనవి.
మీరు అడిగిన అమృతాపిధానమసి .... మంత్రం పరిషేచన విధిలోనిది.
వివరాలు ఇవి
భోజనానికి ముందు, తరువాత చేయవలసిన ఆచారాలు -
భోజనం చేసేటప్పుడు మన పెద్దలు కొన్ని నియమాలను పాటించమని చెబుతారు. వాటిలో ముఖ్యమైనవి ఆపోశనం మరియు పరిషేచనం. ఈ ఆచారాలు కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, వాటి వెనుక విజ్ఞానం (సైన్స్) మరియు గొప్ప అర్థం కూడా ఉంది.
ఆపోశనం అంటే ఏమిటి?
ఆపోశనం అంటే భోజనానికి ముందు, తర్వాత చేతి గుంటలో నీళ్ళు వేసుకుని తాగడం. దీనిని ఆచమనం అని కూడా అంటారు. ఇది మనలోని పంచ ప్రాణాలను (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన) తృప్తిపరచడానికి చేస్తారు. మనం తినే ఆహారం కేవలం కడుపు నింపడానికి మాత్రమే కాదు, అది మన శరీరంలో శక్తిగా మారి అన్ని ప్రాణాలను నడిపిస్తుందని దీని అర్థం.
పరిషేచనం అంటే ఏమిటి?
'పరి' అంటే చుట్టూ, 'సేచనం' అంటే చల్లడం. అంటే, మనం తినే విస్తరి లేదా ప్లేట్ చుట్టూ నీటిని చల్లడం. ఈ ఆచారం ఎందుకంటే, మనం తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలని, బయటి వాతావరణం నుండి ఎలాంటి కాలుష్యాలు చేరకుండా ఉండాలని కోరుకోవడం.
భోజనానికి ముందు ఆచరించాల్సిన పద్ధతి:
1. గాయత్రీ మంత్రం:
ముందుగా "ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్" అనే గాయత్రీ మంత్రాన్ని చదువుతారు. ఈ మంత్రార్థం సూర్యభగవానుడి తేజస్సును ధ్యానించి, మన బుద్ధిని మంచి మార్గంలో నడిపించమని కోరడం. ఈ మంత్రం చదువుతూ, కుడిచేతిలో నీరు తీసుకుని తినబోయే ఆహారం మీద చల్లుకోవాలి.
2. పరిషేచనం:
పగటిపూట అయితే, "సత్యం త్వర్తేన పరిషించామి" అని చెప్పి విస్తరి చుట్టూ నీరు చల్లుకోవాలి. దీని అర్థం, ఆదిత్య రూప పరమాత్మ ను (సత్యమును) అగ్ని రూప ఋతం ద్వారా ఆరాధ్య దైవమందు ప్రతిక్షేపించి పరిషేచనము((పుడిసిట నీళ్లుపోసికొని భోజనపాత్రాదుల చుట్టు విడుచుట.) చేయుచున్నాను
రాత్రిపూట అయితే, "ఋతంత్వా సత్యేన పరిషించామి" అని చెప్పాలి. దీని అర్థం, నైవేద్య/భోజనరూపహవిస్సును నివేదించునపుడు అగ్ని రూప పరమాత్మ ను (ఋతమును) ఆదిత్య రూపసత్యం ద్వారా ఆరాధ్య దైవమందు ప్రతిక్షేపించి పరిషేచనము చేయుచున్నాను" అని అర్థం.
అయితే పగలు సత్యంత్వర్తేన పరిషించామి అని ఎందుకు అనాలి. అంటే...
పగటి వేళ ఆదిత్యవైభవం ఎక్కువ.
అలాగే రాత్రిపూట ఋతం త్వా సత్యేన పరిషించామి అని ఎందుకు అనాలి అంటే....
రాత్రి వేళ అగ్ని వైభవం ఎక్కువ అని మన సంప్రదాయం.
3. ప్రాణాహుతి:
ఈ రెండూ పూర్తయ్యాక, కుడిచేతిలో నీరు వేసుకుని "అమృతమస్తు అమృతోపస్తరణమసి" అంటూ తాగాలి. అమృతమగుగాక. ఉదకమా! నీవు అమృతత్వమునకు ఆధారమైనదానవు అని ఈ మంత్రాలకు అర్థం. అంటే, ఈ నీరు అమృతంలా మారాలని, మన ప్రాణాలకు ఆధారంగా ఉండాలని కోరుకోవడం.
తర్వాత, కింద చెప్పిన ఐదు మంత్రాలను చదువుతూ, కుడిచేతి బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేళ్ళతో అన్నం ముద్దలను పంటికి తగలకుండా మింగాలి.
1. ఓం ప్రాణాయ స్వాహా
2. ఓం అపానాయ స్వాహా
3. ఓం వ్యానాయ స్వాహా
4. ఓం ఉదానాయ స్వాహా
5. ఓం సమానాయ స్వాహా
ఈ ఐదు ముద్దలు మనలోని పంచప్రాణాలకు సమర్పించే ఆహుతులుగా భావించాలి. ఇది ఒక చిన్న యజ్ఞం లాంటిది. తర్వాత మామూలుగా భోజనం చేయడం మొదలుపెట్టాలి.
భోజనం తర్వాత చేయాల్సిన పద్ధతి:
భోజనం పూర్తయ్యాక, కుడిచేతి నిండుగా నీరు తీసుకుని "అమృతాపిధానమసి" అని చెప్పాలి. దీని అర్థం, మనం తిన్న ఆహారానికి ఈ నీరే మూత అని. అంటే, మనం అమృతంలాంటి ఆహారం తిన్నాం, ఇప్పుడు దానిని మూసి ఉంచాలి అని.
తర్వాత, " రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు" అనే మంత్రం చెప్పి, ఆ నీటిని విస్తరి లేదా ప్లేట్ చుట్టూ అపసవ్యదిశలో తిప్పాలి.
దీని అర్థం, ఎన్నో కోట్ల సంవత్సరాలుగా రౌరవ నరకంలో బాధ పడుతున్న ఆత్మల దాహం ఈ నీటితో తీరాలని కోరుకోవడం. ఇది మన భారతీయ సంస్కృతిలో ఉన్న జీవకారుణ్యం, పరోపకార బుద్ధికి గొప్ప ఉదాహరణ. చివరిగా "అన్నదాతా సుఖీభవ" అని చెప్పి లేవాలి.
రౌరవ నరకం
రోరూయతే ఆక్రంద్యతే, తేన ప్రాప్యం నరకమ్ ఈ నరకంలో యాతనా శరీరులు ఎప్పుడూ ఏడుస్తుంటారు. అందుకే రౌరవమని పేరు.
ఇది ఒక భయంకరమైన నరకం. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, అబద్ధాలు ఆడేవారు ఇక్కడ శిక్ష అనుభవిస్తారని చెబుతారు.
ఈ నరకం రెండు వేల యోజనాల వెడల్పుతో ఉంటుందిట. నేల రాగితో చేసి ఉంటుంది. మోకాళ్ల లోతు గుంటలతో ఎప్పుడూ మండుతున్న నిప్పులతో నిండి ఉంటుంది.
శిక్ష అనుభవించేవారు దాని మీద అడుగు పెట్టగానే వారి పాదాలు కాలిపోతాయి. అయితే, వెంటనే అవి మళ్లీ మామూలుగా మారి, తిరిగి కాలుతూనే ఉంటాయి. ఈ విధంగా, వారు నిరంతరం బాధపడుతూ ఉంటారు.
పద్మము, అర్బుదము అనే సంఖ్యలు మన ప్రాచీన భారతీయ గణితశాస్త్రంలో వాడినవి. వాటికి ఒక అర్థం ఉంది.
పద్మము
ఇది చాలా పెద్ద సంఖ్యను సూచిస్తుంది. పద్యతే మహతీం సంఖ్యాం ప్రాప్నోతి గొప్ప సంఖ్యను సూచించునది. పద్మము అంటే 1000 కోట్లు
అర్బుదము
ఇది కూడా పెద్ద సంఖ్యనే. అర్బుదము అంటే అరణం అంబు తద్దదాతి అరణో మేఘః తద్వత్ బహు భవతి మేఘములో జలమువలె బహుసంఖ్య గలది. అర్బుదము అంటే పది కోట్లు
పద్మార్బుదము అంటే?
పద్మార్బుదము అనే పదం 'పద్మము' మరియు 'అర్బుదము' అనే రెండు పదాల కలయిక. సాధారణంగా, ఇలాంటి పదాలను కలిపినప్పుడు వాటి అర్థం ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటుంది.
పద్మార్బుదము అంటే, అనేక పద్మాలు మరియు అర్బుదాలు అని అర్థం. అంటే, కేవలం ఒక పద్మం లేదా ఒక అర్బుదం కాదు, అనేక పద్మాల సంఖ్య మరియు అర్బుదాల సంఖ్య కలిపి లెక్కించలేనంత పెద్ద సంఖ్య అని చెప్పవచ్చు.
ఇది ఏదైనా వస్తువు లేదా జీవుల సంఖ్యను చెప్పడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు, నరకంలో బాధపడే జీవుల సంఖ్యను వర్ణించడానికి 'పద్మార్బుద నివాసినాం' అని వాడారు.. అంటే, లెక్కలేనన్ని కోటానుకోట్ల జీవులు అని అర్థం.
ఈ పరిషేచన ఆచారంలో ఎంతో జీవ కారుణ్యం, పరోపకార బుద్ధి ఉంది. మన సంస్కృతికి జయహో.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
సర్వేజనా సుఖినో భవంతు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి